అర్ధరాత్రి టీడీపీ ఎమ్మెల్యే అరెస్ట్.. అక్రమ అరెస్టులంటూ చంద్రబాబు మండిపాటు

  • భోజనం చేస్తున్న అమర్నాథరెడ్డి, పులివర్తి నానిలను అరెస్ట్ చేసిన పోలీసులు
  • జగన్ ఆటలు సాగనివ్వబోమన్న చంద్రబాబు
  • డీజీపీ, ఎస్ఈసీకి లేఖలు
  • కుప్పంలో పాలకొల్లు ఎమ్మెల్యే అరెస్ట్
  • అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్న పోలీసులు
వైసీపీ ప్రభుత్వ తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఫైర్ అయ్యారు. కుప్పం కార్పొరేషన్ ఎన్నికల్లో కమిషనర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ నిరసన తెలిపిన టీడీపీ నేతలు అమర్నాథ రెడ్డి, పులివర్తి నానిలను పోలీసులు అరెస్ట్ చేయడంపై ఆయన మండిపడ్డారు. హోటల్ లో భోజనం చేస్తున్న వారిని అరెస్ట్ చేసి తీసుకెళ్లడం దారుణమన్నారు. ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వం ఖూనీ చేస్తోందన్నారు. టీడీపీ నేతలను భయపెట్టి ఎన్నికలను ఏకగ్రీవం చేసుకునేందుకు జగన్ ప్లాన్ వేశారని ఆరోపించారు. జగన్ ఆటలను సాగనివ్వబోమని, అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఎన్నికలను నిర్వహిస్తున్న తీరుపై డీజీపీ, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు లేఖ రాశారు. పోలీసుల అధికార దుర్వినియోగంపై చర్యలు తీసుకోవాలని కోరారు. టీడీపీ నేతలు పోటీ చేయకుండా కుట్రలు చేస్తున్నారని పేర్కొన్నారు. వైసీపీతో కొందరు అధికారులు కుమ్మక్కయ్యారని, నామినేషన్లను అక్రమంగా తిరస్కరించారని మండిపడ్డారు. తప్పుడు ఫిర్యాదులతో పోలీసులు కూడా తప్పుడు కేసులు పెట్టి అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అర్ధరాత్రి నిమ్మల అరెస్ట్


టీడీపీ పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడును పోలీసులు అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. కార్పొరేషన్ ఎన్నికల దృష్ట్యా కుప్పంలోని ఓ హోటల్ లో బస చేస్తున్న ఆయన్ను అర్ధరాత్రి 12.30 గంటలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అర్ధరాత్రిపూట నోటీసులిస్తారా? అంటూ పోలీసులను ఈ సందర్భంగా రామానాయుడు నిలదీశారు. నోటీసులివ్వాలనుకుంటే మధ్యాహ్నం ఇవ్వొచ్చు కదా అని ప్రశ్నించారు. గంట తర్వాత ఆయన తలుపులు తీశారు. అనంతరం 1.30 గంటలకు ఆయన్ను పోలీసులు స్టేషన్ కు తీసుకెళ్లారు.

Andhra Pradesh
Telugudesam
Chandrababu
Kuppam
Chittoor District

More Telugu News